ఇరాన్ యుద్ధం పేరుతో భారీ స్కామ్.. ఛారిటీ ముసుగులో దేశ వ్యతిరేక శక్తులకు నిధులు: ఐబీ హెచ్చరిక

  • జమ్మూకశ్మీర్‌లోనే రూ.16 కోట్లకు పైగా వసూళ్లు
  • షియా వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ముఠాలు
  • నిధులను దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వాడుతున్నారని ఐబీ అనుమానం
  • ఆన్‌లైన్‌లో దొరకకుండా ఆఫ్‌లైన్‌లో వసూళ్లు చేస్తున్న కేటుగాళ్లు
దేశవ్యాప్తంగా ఇరాన్ యుద్ధం పేరుతో ఓ భారీ ఛారిటీ స్కామ్ జరుగుతోందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికలు జారీ చేసింది. యుద్ధ బాధితులకు సాయం చేస్తున్నామనే పేరుతో కొన్ని ముఠాలు ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నాయని వెల్లడించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కొందరు రాడికలైజేషన్‌కు ప్రయత్నించవచ్చని సూచనలు జారీ చేసిన నేపథ్యంలో ఐబీ ఈ కొత్త మోసంపై అప్రమత్తం చేసింది.

ఈ స్కామ్ కార్యకలాపాలు దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్నప్పటికీ, జమ్మూకశ్మీర్‌లో దీని తీవ్రత అత్యధికంగా ఉందని ఏజెన్సీలు గుర్తించాయి. ఒక్క కశ్మీర్‌లోనే ఈ ముఠాలు దాదాపు రూ.16 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం సమయంలోనూ ఇలాంటి మోసపూరిత ఛారిటీలు పుట్టుకొచ్చాయని, నిధులు సేకరించిన తర్వాత అదృశ్యమయ్యాయని అధికారులు గుర్తుచేశారు.

మోసం చేసే విధానం ఇది..
ఈ ముఠాలు ప్రజల భావోద్వేగాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. డిజిటల్‌గా మార్పులు చేసిన యుద్ధ ఫొటోలను చూపిస్తూ, కరుణ పుట్టించే కథలు చెప్పి నిధులు సేకరిస్తున్నాయి. ప్రధానంగా షియా వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని, వారి మతపరమైన సున్నితత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసగిస్తున్నారు. వీరి మాటలు నమ్మిన ప్రజలు తమ పొదుపు మొత్తాలతో పాటు బంగారం, విలువైన రాగి పాత్రలను సైతం విరాళంగా ఇస్తున్నారని ఐబీ అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తే సులభంగా దొరికిపోతామనే ఉద్దేశంతో ఈ ముఠాలు పూర్తిగా ఆఫ్‌లైన్‌లో, అంటే ఇంటింటికీ తిరుగుతూ వసూళ్లకు పాల్పడుతున్నాయి. విరాళం ఇచ్చిన వారికి నకిలీ రశీదులు ఇస్తూ, ఈ డబ్బును ఇరాన్‌లోని బాధితులకు పంపుతామని నమ్మిస్తున్నారు.

నిధులు ఎక్కడికి వెళ్తున్నాయి?
ఈ స్కామ్‌లో పాత వేర్పాటువాద ముఠాల హస్తం ఉన్నట్లు ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దుకు ముందు కశ్మీర్‌లో వేర్పాటువాద గ్రూపులకు నిధులు సేకరించిన నెట్‌వర్క్‌లే ఇప్పుడు ఈ ఛారిటీ స్కామ్ నడుపుతున్నాయని తేలింది. ఇలా సేకరించిన నిధులను కొందరు వ్యక్తిగత లాభాలకు వాడుకుంటుండగా, సింహభాగం దేశ వ్యతిరేక కార్యకలాపాలకు, ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని మళ్లీ పునరుద్ధరించడానికి ఉపయోగిస్తున్నారని ఐబీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యకలాపాలపై నిఘా పెంచినట్లు అధికారులు వెల్లడించారు.

Charity Scam
Iran War Scam
IB
Intelligence Bureau
Anti-National Activities
Jammu and Kashmir
Article 370
Separatist Groups
Radicalization
Israel Palestine War

More Telugu News